BIKKI NEWS (July 10) : Telangana Employees Health Cards from July 15th onwards. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద హెల్త్ కార్డులను జూలై 15, 2026 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఐఏఎస్ గారి అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.
Telangana Employees Health Cards from July 15th onwards
ఈ సందర్భంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా త్వరలో ఉద్యోగులకు హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని సమావేశంలో అభిప్రాయపడుతూ, అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శ్రీ మారం జగదీశ్వర్ (టీఎన్జీవో అధ్యక్షులు), శ్రీ ఏలూరి శ్రీనివాసరావు (టీజీవో అధ్యక్షులు), శ్రీ దామోదర్ రెడ్డి (పీఆర్టీయూ), శ్రీ చావా రవి (యూటీఎఫ్), శ్రీ శ్రీనివాసరెడ్డి (సెక్రటేరియట్ అసోసియేషన్), శ్రీ వంగా రవీందర్ రెడ్డి (ట్రెసా), శ్రీ సదానంద గౌడ్ (ఎస్టీయూ), శ్రీ సైదులు (ఎస్టీఎఫ్), శ్రీ దాస్య నాయక్ (క్లాస్-4 ఉద్యోగుల సంఘం), పెన్షనర్ల సంఘ ప్రతినిధులు శ్రీ వెంకటరెడ్డి, శ్రీ కృష్ణమూర్తి, శ్రీమతి ఉమాదేవి, శ్రీ బి. శ్యామ్ (టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పాల్గొన్నారు.
అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు శ్రీమతి బి.ఎం.డి. ఎక్కా, శ్రీమతి క్రిస్టినా చోంగ్తూ, శ్రీమతి సిక్తా పట్నాయక్, శ్రీ హనుమంత్ కొండిబా, శ్రీమతి షికా గోయల్, శ్రీ పాపిరెడ్డి, శ్రీమతి వాణి తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
