Vidya varotsavalu - విద్యా వారోత్సవంలో సీఎం ప్రసంగం - bikki news

Vidya Varotsavalu – విద్యా వారోత్సవంలో సీఎం ప్రసంగం

BIKKI NEWS (MAY 11) : CM Revanth Reddy speech in vidya Varotsavalu today. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యా శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు వెనుకడుగు వేయకుండా అమలు చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రెడ్డి గారు చెప్పారు.

CM Revanth Reddy speech in vidya Varotsavalu today

“పాఠశాలలు దేశ భవిష్యత్తు నిర్మాణ వేదికలు. ఆ వేదికలను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను అనాధలుగా చూడదలుచుకోలేదు. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తతో చూసుకుంటారో అదే రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను చూసుకోవాలన్నదే మా సంకల్పం” అని స్పష్టం చేశారు.

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. కోర్ అర్బన్ ఏరియా CURE లో 1011 కోట్ల రూపాయలతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, సలహాదారులు కేశవరావు గారు, హనుమంతరావు గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా విద్యా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సిలబస్ మారుతోంది. ఏఐ వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారింది. తెలంగాణలో కూడా నూతన విద్యా విధానం అమలు చేయాలని, అదికూడా దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలన్న ఆలోచనల మేరకు నర్సరీ నుంచి 12 వ తరగతి వరకుండే విద్యా విధానం అమలు చేస్తున్నాం” అని విడమరిచి చెప్పారు.

“పాఠశాలల్లో మౌలిక సదుపాయాలే కాకుండా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాఠశాలల్లో బలవర్ధకమైన ఆహారం అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నాం.

విద్యార్థుల కోసం పెట్టే ఖర్చు భవిష్యత్తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నాం. భావి తరాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే తయారు కావాలి. అందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు సహకరించాలి. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది” అని చెప్పారు.

“విద్యా రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలన్నది నా ఆకాంక్ష. విద్యా రంగానికి ఏమాత్రం నిధుల కొరత రాకూడదని బడ్జెట్‌లో 8.22 శాతం నిధులను కేటాయించాం. ఇంకా కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఒక్కసారిగా కాకుండా ఏటేటా పెంచుకుంటూ 15 శాతం వరకు కేటాయింపులు జరుపుతాం” అని తెలిపారు.

10వ తరగతి పాసైన తర్వాత ఇంటర్మీడియట్ కు వచ్చే సరికి డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కొనసాగే విద్యా విధానం అమలు చేయబోతున్నాం. మొదటగా హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నాం.

1.34 కోట్ల జనాభా కలిగిన కోర్ అర్బన్ ఏరియాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వస్తున్న నిరుపేద కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని 1700 కోట్ల రూపాలతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశాం. పేదలకు నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ గురుతర బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేపట్టాం.

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే నాణ్యమైన విద్యను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. కొందరు ఉపాధ్యాయులను విదేశాల్లో విద్యా విధానం అధ్యయనం చేయడానికి పంపించాం. జపాన్, సింగపూర్, వియత్నాం ఇతర దేశాల్లో విద్యా విధానాలను అధ్యయనం చేయడానికి ఏటా అత్యుత్తమ నైపుణ్యం కనబరుస్తున్న 500 మంది టీచర్లను ఎంపిక చేసి అధ్యయనం కోసం విదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టాలి.

విద్యార్థుల్లో అత్యుత్తమ నైపుణ్యం గుర్తించే ఉపాధ్యాయులను ప్రభుత్వం అభినందిస్తుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామం తీసుకుంటున్న ఉపాధ్యాయులను సత్కరిస్తామని చెప్పారు.

“విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పులు టీచర్ల కోసమో నాయకుల కోసమో కాదు. అత్యంత నిరుపేద కుటుంబాల పిల్లల కోసం, వారి సంక్షేమం కోసం చేపట్టాం. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతాం” అని ముఖ్యమంత్రి గారు అన్నారు

“ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించబోయే వస్తువుల కోసం వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నాం. వాటిల్లో నాణ్యత లోపిస్తే బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. బడి ప్రారంభమైన రోజునే పిల్లలకు ఒక జత డ్రెస్ అందించి నెల రోజుల్లో మరో జత అందించాలి.

సంస్కరణలు అమలు చేసే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. నిరుపేద కుటుంబాల పిల్లల ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలన్నది మా ఆలోచన. ప్రైవేటుకు ధీటుగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అత్యుత్తమ విద్యను అందించాలన్నది మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.

“రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 19 లక్షల విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబాల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. ఉపాధ్యాయులకు ఇది బరువు కాదు. బాధ్యత. ఉద్యోగం కాదు భావోద్వేగం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. తెలంగాణ విద్యా విధానాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం.

నిరుపేదలకు మంచి నాణ్యమైన విద్యను అందించాలన్నదే నా ఆలోచన. నా కల” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక చెక్కును ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →