BIKKI NEWS (MAR. 05) : INDIA WON THE MATCH AGAINST ENGLAND IN T20 SEMI FINALS. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పాత ప్రత్యర్థి ఇంగ్లాండ్ను 7 రన్స్ తేడాతో ఓడించి ఘనంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
సంజు శాంసన్ బ్యాటింగ్ వీరవిహారం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. సంజూ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంజుకు తోడుగా ఇషాన్ కిషన్ (39), శివం దూబే (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) దూకుడుగా ఆడటంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
ఇంగ్లాండ్ పోరాటం వృధా
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. జాకబ్ బెథెల్ (Jacob Bethell) అద్భుత సెంచరీతో పోరాడినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత బౌలర్ల ధాటికి వికెట్లు పతనం
బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. కీలక సమయంలో వికెట్లు తీసి ఇంగ్లాండ్ జోరును తగ్గించాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి కూడా కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి ఓవర్లో శివం దూబే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు.
అక్షర్ పటేల్ పుట్టిన రెండు క్యాచ్ లు మ్యాచ్ కే హైలెట్ గా నిలిచాయి. అలాగే చివరి ఐదు ఓవర్లలో భారత్ బౌలింగ్ దళం తన సత్తా చూపించింది.
ఈ విజయంతో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. వచ్చే ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. రోహిత్ సేన గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ఇండియా చూపిస్తున్న ఈ తెగువకు క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది.
స్కోర్ వివరాలు:
- భారత్ స్కోరు: 253/7 (20 ఓవర్లు)
- ఇంగ్లాండ్ స్కోరు: 246/7 (20 ఓవర్లు)

