CHECK POSTS CLOSED – చెక్ పోస్టుల మూసివేత

BIKKI NEWS (OCT. 22) : CHECK POSTS CLOSED IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ గారు డీటీఓలకు ఆదేశాలు విడుదల చేశారు.

CHECK POSTS CLOSED IN TELANGANA

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) స్వయంగా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, చెక్ పోస్టులు మూసి వేయబడినట్టుగా కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను సూచిస్తూ ఉన్న బోర్డులు, బారికేడ్లను తక్షణం తొలగించాలని డీటీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తొలగింపు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని చెప్పారు.

చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తక్షణం డీటీఓ కార్యాలయాలకు తరలించాలని, అలాగే పరిపాలనకు సంబంధించిన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లను అన్నింటినీ డీటీవో కార్యాలయంలో భద్రపరచాలని ఆదేశించారు.

ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహించిన స్థలాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు నివేదిక అందించాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK