Prc telangana - మరోసారి గడువు పొడిగించే అవకాశం - bikki news

PRC TELANGANA – మరోసారి గడువు పొడిగించే అవకాశం

  • BIKKI NEWS : 27-01-2026

PRC TELANGANA DATE MAY EXTEND. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ (వేతన సవరణ) అమలు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించిన పీఆర్సీ కమిటీ కాలపరిమితి ఈ ఏడాది మార్చితో ముగియనుండగా, మరోసారి గడువు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఊపందుకుంది.

PRC TELANGANA DATE MAY EXTEND

నివేదిక సిద్ధమే…

పీఆర్సీ కమిటీ నివేదిక ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం దాన్ని స్వీకరించేందుకు ముందుకు రావడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పిలిస్తే వెంటనే నివేదిక అందజేయడానికి కమిటీ సిద్ధంగా ఉందని, కానీ కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు అంటున్నారు.

పీఆర్సీ కమిటీ నేపథ్యం

బీఆర్‌ఎస్ హయాంలో 2023 అక్టోబర్ 2న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ చైర్మన్‌గా, బీ. రామయ్య సభ్యుడిగా పీఆర్సీ కమిటీని నియమించారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సిన ఈ కమిటీ గడువు 2024 ఏప్రిల్ 2తో ముగిసింది. ఎన్నికల కారణంగా అప్పటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు నాలుగోసారి పొడిగింపుపై చర్చ నడుస్తోంది.

బడ్జెట్‌పైనే ఉద్యోగుల ఆశలు

దసరా, సంక్రాంతి వరకు ఎదురు చూసిన ఉద్యోగులు ఇప్పుడు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్ సందర్భంగా అయినా పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. లేకపోతే మరో ఆరు నెలలు నిరీక్షించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిట్‌మెంట్‌పై డిమాండ్లు

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం 30 శాతం వరకు మాత్రమే ఇవ్వవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

  • 1% ఫిట్‌మెంట్‌కు నెలకు రూ.250–300 కోట్లు
  • 30% ఫిట్‌మెంట్‌కు సుమారు రూ.7,500 కోట్లు
  • 51% ఫిట్‌మెంట్‌కు సుమారు రూ.12,750 కోట్లు
ఆర్థిక పరిస్థితే అడ్డంకా?

రాష్ట్ర ఆదాయం తక్కువగా, వ్యయం ఎక్కువగా ఉందని సీఎం ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. రెండు డీఏలను ప్రకటించిన తర్వాత పీఆర్సీ అమలు చేయడం ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపుతుందని అంచనా. ఈ కారణంగానే ప్రభుత్వం నివేదికను స్వీకరించకుండా ఆలస్యం చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఉద్యోగుల్లో అసంతృప్తి

రెండో పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమలులోకి రావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ అమలు కాలేదు. దాంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నామని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. పీఆర్సీ గడువులను పదేపదే పొడిగించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →