BIKKI NEWS (NOV. 29) : OLD PENSION NOT APPLICABLE FOR REGULARIZED EMPLOYEES. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చట్టం 1994 (పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపం హేతుబద్ధీకరణ)ను సవరిస్తూ ఆర్డినెన్స్ కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
OLD PENSION NOT APPLICABLE FOR REGULARIZED EMPLOYEES.
నవంబర్ 17వ తేదీన మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ కు తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపగా, గెజిట్ జారీ అయింది.
ఈ ఆర్డినెన్సు ప్రకారం 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో క్రమబద్ధీకరించబడిన వారికి పాత పెన్షన్ అమలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ కోర్టులకు వెళ్లినా అవి ఇచ్చే తీర్పులను అమలు చేయడానికి వీల్లేకుండా చట్ట సవరణ చేశారు.
క్రమబద్ధీకరణ అయిన తేదీ నుంచి మాత్రమే ప్రయోజనాలు కల్పించే విధంగా ఆర్డినెన్స్ లో పొందుపరిచారు. ఈ ఆర్డినెన్స్ రాకముందు పదవీ విరమణ చేసి.. పాత పెన్షన్ విధానం కిందకి వచ్చిన వారి నుంచి ఎలాంటి రికవరీ చేయకుండా.. 2004 సెప్టెంబర్ ఒకటి తరువాత క్రమబద్ధం అయి.. పదవీ విరమణ చేసిన వారికి కొత్త పెన్షన్ అమలు చేయాలని ఆర్డినెన్స్ లో స్పష్టం చేశారు. ఇకపై పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏ న్యాయస్థానం ఆదేశించినా దానిని అమలు చేయరాదని పేర్కొన్నారు.
1993 సెప్టెంబర్ నాటికి ఐదేళ్లు ఫుల్ టైమ్, పదేళ్లు పార్ట్ టైమ్ లో ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేసిన కాంట్రాక్టు, తాత్కాలిక, నాన్ మస్టర్ రోల్లోని ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి వీలుగా అప్పట్లో వన్ టైం సెటిల్మెంట్ కింద ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చాలా మంది 2004 సెప్టెంబర్ 1 తరువాత క్రమబద్ధం అయినవారు ఉన్నారు. వారిలో దాదాపు 7 వేల మంది వరకు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ లో పనిచేసిన సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ న్యాయస్థానాలకు వెళ్లారు.
నీటిపారుదల, విద్యా శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కొందరు కోర్టుల నుంచి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఆ విధంగా పాత సర్వీసును పరిగణనలోకి తీసుకుని పాత పెన్షన్ను అమలు చేస్తే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుందని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడానికి సాధ్యం కాదని ఆర్థిక శాఖ నివేదించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్డినె న్స్ను తీసుకుని వచ్చింది.

