BIKKI NEWS (MAR. 28) : తెలంగాణ శాసనసభలో నేడు (మార్చి 28, 2026) “తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం మరియు తల్లిదండ్రుల సంరక్షణ పర్యవేక్షణ బిల్లు-2026” (Telangana Parents Support Bill 2026) ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. వృద్ధాప్యంలో కన్నవారిని భారంగా భావించే సంతానానికి గుణపాఠం చెప్పేలా, బాధ్యతను గుర్తు చేసేలా ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది.
Telangana Parents Support Bill 2026
ఈ రోజు (శనివారం) జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మరియు వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించింది. సభలో చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందే దిశగా సాగుతోంది.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల ముక్కుపిండి మరీ వారి నుంచి భరణం వసూలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, వృద్ధులు అనాథలుగా మారుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎవరికి వర్తిస్తుంది?
ఈ బిల్లు కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ నిధులతో వేతనం పొందే సంస్థల సిబ్బంది, ప్రైవేటు రంగ ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధులకు (MLAs, MLCs, సర్పంచ్లు తదితరులు) కూడా వర్తిస్తుంది.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
వేతనంలో కోత
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు రుజువైతే, సదరు ఉద్యోగి స్థూల జీతం (Gross Salary) నుంచి 15 శాతం లేదా గరిష్టంగా ₹10,000 (ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు.
ఫిర్యాదు ప్రక్రియ
బాధితులైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అప్పీలు అవకాశం
జిల్లా స్థాయి నిర్ణయంపై సంతృప్తి లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలోని వయోవృద్ధుల కమిషన్ (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో) కు 45 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చు.
దివ్యాంగులకూ వర్తింపు
తల్లిదండ్రులతో పాటు ఆదాయ వనరులు లేని దివ్యాంగులైన తోబుట్టువుల సంరక్షణను కూడా ఈ బిల్లు పరిధిలోకి చేర్చారు.

