ఇంటర్ విద్య పై కీలక అంశాలు వెల్లడించిన డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య

BIKKI NEWS (OCT. 25) : KEY CHANGES IN INTERMEDIATE EDUCATION FROM 2026. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న పలు కీలక సంస్కరణలు మరియు ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు, పరీక్షల షెడ్యూలు వంటి అంశాల మీద ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య కీలక విషయాలను ప్రకటించారు‌ .

KEY CHANGES IN INTERMEDIATE EDUCATION FROM 2026

ఇంటర్‌ బోర్డు పరీక్షల విభాగం కంట్రోలర్‌ జయప్రద బాయి, సంయుక్త కార్యదర్శులు జ్యోత్స్న, వసుంధర, భీమ్‌సింగ్, సిలబస్‌ నిపుణుడు రమణారావు తదితరులతో కలిసి ఆయన శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

నవంబరు 1వ తేదీ నుంచి పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

ఇంటర్‌ ఎంఈసీ గ్రూపులో గణితం సబ్జెక్టుకు ప్రత్యేక ప్రశ్నపత్రం ఉంటుందని, ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు అమలవుతుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు.

ఇప్పటివరకు ఎంపీసీ, ఎంఈసీ గ్రూపు విద్యార్థులకు ఒకే ప్రశ్నపత్రాన్ని ఇస్తున్నామని, నూతన విధానంలో 100 మార్కులకు ఒకటే ప్రశ్నపత్రం ఉంటుందని తెలిపారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 3 నుంచి 20వ తేదీ వరకు, వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయని తెలిపారు.

సైన్స్‌ సబ్జెక్టులకు చివరిసారిగా 2013-14 విద్యా సంవత్సరంలో సిలబస్‌ మార్చారు. 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది సమగ్రంగా మారుతుందని తెలిపారు.

పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌ ముద్రణ కోసం పాఠశాల విద్యాశాఖ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

14 ప్రైవేటు కళాశాలలు వాణిజ్య, గృహ సముదాయాల్లో కొనసాగుతున్నందున వాటికి ఇంకా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. వాటిల్లో 3 వేల మంది విద్యార్థులున్నారని తెలిపారు.

హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ విద్యార్థులు అధికంగా ఉన్న 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి జన వికాస్‌ కార్యక్రమం కింద సుమారు రూ.117 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈతోపాటు మరో 10 రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్, తత్సమాన విద్య అందించే బోర్డుల్లో 20 శాతం అంతర్గత మార్కుల విధానం అమలవుతోందని కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. విద్యార్థులకు అనుభవపూర్వక అభ్యసనం ఉండటం అవసరం’ అని ఆయన తెలిపారు. నిపుణుల కమిటీని నియమించి పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK