TELEMETRY – కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి టెలీమెట్రి

BIKKI NEWS (JULY 16) : TELEMETRY SYSTEM FOR KRISHNA GODAVARI WATER USAGE. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారి సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. కేంద్ర జలశక్తి మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాలుగు అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చామని సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వివరించారు.

TELEMETRY SYSTEM FOR KRISHNA GODAVARI WATER USAGE

ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నదీ జలాల వినియోగంపై కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ గారి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిమ్మల రామానాయుడు గారు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య నాలుగు అంశాల్లో అంగీకారం కుదిరినట్టు తెలిపారు. నదీ జలాల విషయంలో రాష్ట్రం వెలిబుచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని టెలిమెట్రీ విధానం అమలు చేయాలని తెలంగాణ ఎప్పటి నుంచో అడుగుతున్నామని, అందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని చెప్పారు.

నదీ జలాల్లో అన్ని పాయింట్స్ లో టెలిమెట్రీ విధానాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేయడానికి అంగీకారం కుదరడం తెలంగాణ విజయంగా ముఖ్యమంత్రి గారు అభివర్ణించారు. “నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు ఎవరు ఎక్కు, ఎవరు తక్కువ వినియోగిస్తున్నారని పరిశీలించడానికి టెలిమెట్రీ విధానం అమలు చేయాలని మొదటి నుంచి కోరుతున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశం ఉన్నప్పటికీ ఇంతకాలం అమలు జరగలేదు.

విభజన చట్టంలో పేర్కొన్నట్టుగానే గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణ నుంచి, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి పనిచేయాలన్న అంశంపై అంగీకారం కుదిరింది. గతంలో జరిగిన ఎపెక్స్ కమిటీ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలు జరగలేదు.

ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచనల మేరకు ప్లంజ్ పూల్ తో పాటు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు చేపట్టడానికి అంగీకారం తెలియజేసింది.

ఇకపోతే, రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ, గోదావరి నదులు, వాటి ఉప నదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీనియర్ అధికారులు, నిపుణులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.

కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత నెల రోజుల్లోగా నదీ జలాలపై ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, ఇతర సమస్యలు అన్నింటిపైనా సమగ్రంగా అధ్యయనం చేసి సూచనలు ఇస్తుంది. కమిటీ నిర్ణయాలను బట్టి తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది నిర్ణయిస్తాం.

గోదావరి – బనకచర్లపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రివర్ మేనేజ్మెంట్ అథారిటీ, సీడబ్ల్యూసీ వంటి సంస్థలన్నీ వాటి అభ్యంతరాలను తెలియజేశాయి. గోదావరి – బనకచర్ల చేపడుతామని ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చెప్పలేదు. వారు చెప్పినప్పుడు ఆ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ అభ్యంతరం చెబుతుంది.

నాలుగు అంశాలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. అధికారుల కమిటీలో అన్ని అంశాలు చర్చకొస్తాయి. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను గుర్తించి వాటిపై ఎలా ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తాం.

కేంద్ర మంత్రి పాటిల్ గారి సమక్షంలో జరిగిన సమావేశంలో సుహృద్భావ వాతావరణంలో జరిగింది. పాటిల్ గారు ఒక జడ్జీలా వ్యవహరించారు. ఇది ఇన్ ఫార్మల్ గా జరిగిన సమావేశం. ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం ఒక వేదికగా వ్యవహరించింది. టెలిమెట్రీ విధానం అమలుకు ఏపీ అంగీకరించడం తెలంగాణ విజయం

ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి ఢిల్లీ వచ్చాం. జఠిలం చేసుకోవడానికి కాదు. జఠిలమైతే బాగుండని కొందరు అనుకుంటుండొచ్చు. మేం తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. సమస్యలను ఎలా పరిష్కరించాలన్న అవగాహన మాకుంది. వివాదాలకు పరిష్కారం చూపించడమే మా బాధ్యత..” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.