BIKKI NEWS (DEC. 29) : 25 THOUSAND BOGUS EMPLOYEES IN TELANGANA. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ వ్యవస్థను ఆదాయ వనరుగా మార్చుకుని కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి ఉద్దేశించిన ఔట్సోర్సింగ్ పద్ధతిని బినామీ ఏజెన్సీల ద్వారా దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ నిధులను గోల్మాల్ చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డుల్లో చూపే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం చెల్లించే మొత్తాలకు ఉద్యోగులకు అందే వేతనాలకు పొంతన లేకపోవడం వంటి అంశాలు విచారణలో వెలుగుచూశాయి.
25 THOUSAND BOGUS EMPLOYEES IN TELANGANA.
గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అక్రమాలపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. శాఖల వారీగా ఎంత మంది వాస్తవంగా పనిచేస్తున్నారు, ఎంత మంది జీతాలు తీసుకుంటున్నారు, రికార్డుల్లో మాత్రమే ఉన్న బోగస్ ఉద్యోగులెంతమంది అన్న వివరాలను సేకరిస్తున్నారు. ప్రాథమికంగా సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఒకే వ్యక్తి వేర్వేరు విభాగాల్లో ఐడీలు మార్చి రెండు వేతనాలు తీసుకున్న ఘటనలు 600కిపైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది.
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ పేరుతో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలింది. ప్రభుత్వం ఒక ఉద్యోగికి చెల్లించే మొత్తంలో ఉద్యోగికి అందేది తక్కువగా ఉండగా, మిగతా సొమ్ము ఏజెన్సీల జేబుల్లోకి వెళ్లుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల వరకు ఏజెన్సీలకు చేరుతున్నా, చాలాచోట్ల ఉద్యోగుల సంక్షేమ నిధులు సక్రమంగా చెల్లించట్లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఈ మొత్తం వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేపట్టి, అక్రమంగా పొందిన సొమ్మును రికవరీ చేయడమే కాకుండా, ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వ్యవస్థను పారదర్శకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. విచారణ పూర్తయితే రాష్ట్ర పరిపాలనను కుదిపేసే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

