BIKKI NEWS (SEP. 09) : Young India integrated schools in Telangana. తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్నకృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి గారికి వివరించారు.
Young India integrated schools in Telangana
ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నార్త్ బ్లాక్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయన్నారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి గారు వివరించారు.
అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని వివరించారు. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి గారికి సీఎం గారు తెలిపారు.
ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కోరారు.
గత ప్రభుత్వంలో అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చిందని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో వాటి రీస్ట్రక్చరింగ్కు అనుమతించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు చేసిన విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ గారు సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర మంత్రి గారిని కలిసిన వారిలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి గారు, పోరిక బలరాం నాయక్ గారు, సురేశ్ షెట్కార్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.